Pages

Tuesday, September 11, 2012

అంతరిక్షంలో నువ్వూ నేనూ (Part 2/4): ఎందుకీ పరిశోధనలు?

*** శ్రీ రామ***


ఇంతింత డబ్బులు ఖర్చు పెట్టి ఈ అంతరిక్ష పరిశోధనల వల్ల మనం సాధించేది ఏమిటి? వేరే గ్రహాల మీద ఏమి ఉంటే మనకేంటి, లేకపోతే మనకేంటి.. అదే డబ్బుతో బోలెడన్ని మంచి అభివృద్ధి పనులు ఇక్కడే చెయ్యవచ్చు కదా.. ఆ రీసెర్చ్ ఏదో భూమి మీద చేస్తే దాని ఫలితాలు ప్రజలకు వెంటనే అందుతాయి కదా.. ఇది నాకు చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది.


హ్మం... ప్రపంచవ్యాప్తంగా చాలామంది అడిగే ప్రశ్న ఇది.. నేను అనుకోవడం సహజంగా మనిషికున్న తెలివితేటలూ, ఆలోచనా పరిజ్ఞానం, మేధస్సు అతనిలో ఎప్పటికప్పుడు తన చుట్టూ ఉన్న ప్రకృతిని, విశ్వాన్ని శోధించాలనే ఆసక్తిని రగిలిస్తూ ఉంటుంది. ఆ లక్షణమే మనిషిని మిగతా జీవులన్నీటి కంటే ఉన్నతంగా నిలబెట్టింది. దాని వల్లే మానవ నాగరికత, సాంకేతికత మొదలైనవన్నీ మరింతగా అభివృద్ధి చెందుతూ మానవ మనుగడ రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు ఆ సముద్రానికి ఆవల ఏముందో తెలుసుకోవడానికి కొలంబస్ లాంటి వాళ్ళు ప్రయత్నించినట్టే ఇప్పుడు ఇంకొంచెం పరిధి పెరిగి భూమికి ఆవల ఏముందో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు మనిషి.


అది నిజమే కానీ.. నేననేదేంటంటే భూమి మీద ఏ మూల ఏముందో తెల్సుకుంటే మనకి ఏదో ఒక రకంగా ఉపయోగం ఉండొచ్చు. ఆఖరికి సముద్రగర్భంలో అయినా సరే ఫలానా చోట చమురు నిల్వలు ఉన్నాయంటే వెలికి తీసి ఇంధనంగా ఉపయోగించుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏ మార్స్ మీదో, చంద్రుడి మీదో లేక ఇంకేదో గ్రహం మీదో నీరో, బోల్డంత ఇంధననిల్వలో లేక అంతులేని ఖనిజసంపదో  ఉన్నాయని కనిపెట్టాం అనుకుందాం.. దాని వల్ల మనకేంటి ఉపయోగం?


అక్కడ ఏదయినా విలువైన ఖనిజసంపదో, ఇంధనంగా ఉపయోగించదగిన రసాయన మూలకాలో ఉన్నాయని తెలుసుకుంటే, తరువాతి దశలో అవతార్ సినిమాలో చూపించినట్టు మనం వెళ్ళి అవన్నీ తెచ్చుకోవడమే... 


అంత దూరం నుండి మనం తెచ్చుకోవడం వీలవుతుందా.. అసలు అది సాధ్యమయ్యే పనేనంటావా?


టైటాన్ మీద మీథేన్ సరస్సుల ఊహచిత్రం 
ఒక శతాబ్దం క్రితం ఇలా 5 కోట్ల కిలోమీటర్ల దూరాన్ని ఎనిమిది నెలల్లో ప్రయాణించగలమని ఎవరైనా ఊహించారా? మనిషి నిరంతర కృషి, పట్టుదలతోనే కదా ఈ రోజు అది సాధ్యమయింది. అలా ఈ గత యాభై సంవత్సరాలలో టెక్నాలజీ అభివృద్ధి చెందిన క్రమాన్ని బట్టి చూస్తే అది అసాధ్యమేం కాకపోవచ్చు కదా.. అసలు అక్కడ దొరికే ప్రకృతి వనరులను భూమి మీదకు తెచ్చుకోవడమే కాదు, ఇక్కడ మనం రోజూ ఉత్పత్తి చేస్తున్న హానికరమైన చెత్తని ఇక్కడే పడేసి భూమిని విషతుల్యం చేసేకన్నా అక్కడకి తీసుకెళ్ళి పారేయొచ్చు కూడా..

హ్మ్.. అయితే ఇంకేం మరి.. మనకి దగ్గరలో ఉన్న చంద్రుడి మీద ఉన్న హీలియం-3 దగ్గర నుండి అక్కడెక్కడో శని గ్రహానికి ఉపగ్రహం అయిన టైటాన్ మీద కురిసే మీథేన్ వర్షాల వరకు అన్నీ మనం తెచ్చేసుకుంటే మనకి ఇక ఇంధనకొరత అన్నదే ఉండదేమో.. చంద్రుడి మీద ఉన్న హీలియం-3 కాలుష్యం విడుదల చెయ్యని క్లీన్ ఎనర్జీ ఇంధనమట కూడా. అయినా అలా దోచుకొచ్చేవన్నీ ఒక్క అమెరికాకేనా.. మిగతా వారికి ఏం లేవా పాపం.. :-)



ఎవరు ముందు వెళ్ళి తెచ్చుకుంటే వారిదే .. ఎందుకంటే మరి ఇప్పుడు ఇంత  డబ్బు ఖర్చు పెట్టేది, రిస్క్ తీసుకునేది వారే కాబట్టి.. ఉదాహరణకి మన దృవప్రాంతాలే తీసుకో. నార్త్‌పోల్‌లొ ఇంధన మరియు కొన్ని అరుదైన ఖనిజవనరులు  దొరుకుతాయి అని తెలీగానే ఆ ప్రాంతం మీద ఆధిపత్యం కోసం అమెరికా, రష్యా, కెనడా, నార్వే వగైరా దేశాలు ఎంత ప్రయత్నిస్తున్నాయో చూస్తున్నాం కదా. అయినా ఈ స్పేస్‌రేస్‌లొ ఇండియా, చైనా, రష్యాలు కూడా ఏమీ తీసిపోలేదు. మన ఇండియా సంగతే చూడూ... ఇప్పటికిప్పుడు మార్స్ మీదకి రాకెట్ పంపుతాం అని ఎందుకు ప్రకటించింది అనుకుంటున్నావ్.. అధిక జనాభా, పేదరికం లాంటి అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా చంద్రుడి మీదకి వెళ్ళడానికి ఎందుకు అంత ఖర్చుపెడుతున్నారు అనుకున్నావ్.. ఇవన్నీ కూడా ఇంకో ముప్పై నలభై సంవత్సరాల తరువాత, అంటే ఇప్పుడున్న ప్రకృతి వనరులన్నీ అడుగంటిపోయాక భవిష్యత్తులో ఇంధనం కోసం జరగబోయే యుధ్ధాల్లో పైచేయి సాధించడానికి అన్నమాట..

ఇంతకీ ఈ రేస్‌లొ మనవాళ్ళ పొజిషన్ ఏంటో కాస్త వివరంగా చెప్పు. 

ఈ అంతరిక్ష పరిశోధనల రేసులో మన ఇండియా మంచి పొజిషన్ లోనే ఉందని చెప్పుకోవచ్చు. అయితే మిగతా దేశాలతో పోల్చి చూస్తే మనవాళ్ళు సాధించిన విజయాలను కొంచెం స్పెషల్ గా మెచ్చుకోవాలి.

ఎందుకలా?

ఎందుకంటే.. సైన్సు, మ్యాథ్స్ విషయంలో మన వాళ్ళకి స్వతహాగా ఉన్న టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే పరిమిత బడ్జెట్, అణుబాంబు బూచి చూపి కొన్ని సాంకేతిక పరికరాల మీద అమెరికా వాళ్ళు విధించే ఆంక్షలు, అంతర్గతంగా కొన్ని రాజకీయపరమైన ఇబ్బందులు ఇలా ఇంకా ఎన్నెన్నో అడ్డంకులు, అవరోధాలు దాటుకుని మన శాస్త్రజ్ఞులు సాధించే విజయాల యొక్క పరిధి కొంచెం ఎక్కువే అని చెప్పుకోవాలి. అంతెందుకు మొన్న ఆగస్ట్ పదిహేనున మనవాళ్ళు మార్స్ మీదకు రాకెట్ పంపుతాం అని ప్రకటించగానే కొన్ని పశ్చిమ దేశాల్లో నిరసన వ్యక్తమైంది. కొంతమంది బ్రిటన్ ఎంపిలు అయితే మార్స్ మీదకి రాకెట్ పంపే స్థోమత ఉన్న భారతదేశానికి పేదరిక నిర్మూలన ఫండ్ పేరుతో బ్రిటన్ ఇచ్చే ధనసహాయాన్ని నిలిపివేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు.


పరిమిత బడ్జెట్ అంటే ఎంత ఉంటుందేంటి? అమెరికా లాంటి దేశాలతో పోల్చి చూస్తే చాలా తక్కువే ఉంటుందేమో కదా.. 

నువ్వు ఊహించినట్టుగానే ఈ స్పేస్ రీసెర్చ్‌కి ఎక్కువ ఖర్చు పెట్టేది అమెరికానే. ఆ దేశం ఇంచుమించు సంవత్సరానికి 90 వేల కోట్లు ఖర్చు పెడుతుంది. ఇక స్పేస్ రీసెర్చ్‌కి ఇండియా, చైనా వార్షిక బడ్జెట్ దాదాపు ఆరువేల కోట్లు ఉంటుంది. కొన్ని యూరోప్ దేశాలు మన కన్నా ఎక్కువ ఖర్చు పెట్టినా సరే భవిష్యత్తులో అమెరికాకి సరైన పోటీ ఇండియా, చైనా, రష్యాల నుండే..

ఏంటీ.. నమ్మలేకుండా ఉన్నా... మన దేశం ఆరు వేల కోట్ల రూపాయలు కేవలం స్పేస్ రీసెర్చ్ మీద ఖర్చు పెడుతుందా? చాలా ఎక్కువ కదా..


కమాన్.. మన దేశంలో జనాలు మందు మీద ఖర్చు పెట్టే మొత్తం సంవత్సరానికి సుమారు 35 వేల కోట్లు. కేవలం ఈ మద్యం మీద ఒక 20 శాతం పన్ను వేసినా చాలు ఈ ఆరు వేలు కోట్లు రాబట్టడానికి. అందులోనూ ఈమధ్య ఇస్రో వేరే దేశాల శాటిలైట్లని మన రాకెట్ల సహాయంతో కక్ష్యలో ప్రవేశపెట్టడం ద్వారా బాగానే సంపాదిస్తున్నారులే..

హహహా.. అంతేనంటావా.. :-) అయినా మన దేశం డబ్బు పరంగా పేద దేశం అయ్యిండొచ్చేమో కానీ మేధస్సుపరంగా కాదు అని నా నమ్మకం. అసలు అన్నిటికన్నా ముఖ్యమైనది ఒకటి మర్చిపోయాం.నాకయితే అసలు అదొక్కటే చాలు అనిపిస్తుంది. అదేంటంటే.. ఈ రోదసి యాత్రలు, అంతరిక్షపరిశోధనలు, స్పేస్ స్టేషన్లు వీటన్నిటితో మనం అంతరిక్షంలో సాధించే విజయాల సంగతెలా ఉన్నా ఆ పరిశోధనలలో భాగంగా కనిపెట్టే వివిధ రకాల టెక్నాలజీలు బయట వేరే వాటిల్లో ఎంత ఉపయోగపడుతున్నాయో కదా..

నిజమే.. చాలా ముఖ్యమైన కోణం ఇది.. అసలు పర్యావరణం మీద జరిగే పరిశోధనలు, వాతావరణం మీద అధ్యయనం చేసి భవిష్యత్తులో రాబోయే విపత్తుల గురించి మనకి అందించే ముందస్తు హెచ్చరికలు, శాటిలైట్ టీవీలు, GPS లు, సెల్ ఫోన్లు, తేలికైన మరియు ధృఢమైన కార్బన్ ఫైబర్ లాంటి లోహమిశ్రమాలు, రకరకాల ప్లాస్టిక్‌లు, ఎక్కువ కాలం నిలువ ఉండే ఆహార పదార్థాలు, విమానయాన పరిశ్రమలో ఉపయోగించే టెక్నాలజీలు, క్రీడాపరికరాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితాకి అసలు అంతే లేదు.

స్పేస్ మెడిసిన్ రీసెర్చ్‌లో కూడా ఇలాంటివి చాలానే ఉన్నాయి. క్లిష్టమయిన శస్త్రచికిత్సలలో ఉపయోగించే ఎన్నో వైవిధ్యమైన మరియు అత్యాధునిక టూల్స్ మొదట ఈ రోదసియాత్రల కోసం అభివృద్ధి పరిచినవే ఆ తరువాత అవి మనకి బయట కూడా ఉపయోగపడుతున్నాయి. ఇంకా చంద్రుడి మీద మొక్కలు పెంచే ఉద్దేశ్యంలో రూపొందించబడ్డ కృతిమమట్టి అక్కడ ఉపయోగించకపోయినా ఆ తరువాత భూమి మీద ఎరువులరంగంలొ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. అసలు నాసా లెక్క ప్రకారం వాళ్ళు మిగతా ఇండస్ట్రీలతో పాలుపంచుకున్న దాదాపు రెండు వేల టెక్నాలజీలు ఇప్పుడు ఇంచుమించు ముప్పై వేల  సెకండరీ అప్లికేషన్స్‌లలో వాడుతున్నారట. అలా ఈ అంతరిక్ష పరిశోధనల వల్ల ఉత్పన్నమైన ఉపఉత్పత్తులు మనకి ఇప్పుడు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నాయి. ఏదేమైనా మానవ మేధస్సుతో ఇలాంటి విజయాలు సాధించినప్పుడు చాలా గర్వంగానూ, వాళ్ళు రూపొందించిన అత్యంత క్లిష్టమయిన టెక్నాలజీలను చూసినప్పుడు చాలా ఇన్స్పైరింగ్ గానూ ఉంటుంది కదా..

అవును.. నేను చెప్పాలనుకున్న ఇంకో పాయింట్ అదే.. మన ఇండియాలో ఏ కారణాల వల్ల అయితేనేమీ టెన్త్ స్టాండర్డ్ అవగానే ఇంజనీరింగ్ లేక మెడిసిన్ అంటూ ఏదో ఒక ప్రొఫెషనల్ కోర్సుల్లోనో, లేక ఇతరత్రా సైన్స్‌కి సంబంధించిన కోర్సుల్లోనో చేరడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతారు. అదే అమెరికా, యూరోప్ లాంటి దేశాల్లో ఇలాంటి జాబ్ గ్యారంటీ కోర్సులకన్నా, వాళ్ళకి నచ్చింది, సులభంగా అనిపించిందే చదవడానికి స్వేచ్ఛ ఎక్కువ కాబట్టి సైన్స్, మ్యాథ్స్‌కి సంబంధించిన కోర్సులు చదివేవాళ్ళు తక్కువైపోతున్నారట. ఇలాంటి పరిశోధనలు, అంతరిక్షంలో నాసా సాధించే విజయాలు అక్కడి యువతలో సాంకేతిక కోర్సుల వైపు మొగ్గు చూపడానికి ఇన్స్పిరేషన్ కలిగిస్తుంది అని ఒక అంచనా.

అవున్లే పాపం.. భవిష్యత్తులో అమెరికా వాళ్ళు టెక్నాలజీ డెవెలప్మెంట్ విషయంలో చైనా, ఇండియా, కొరియాలతో పోటీ పడాలంటే చాలా కష్టం. ఇప్పటికే పశ్చిమ దేశాలు చాలా వెనుకపడ్డట్టు కనిపిస్తున్నారు.


:-) ఇక ఈ పరిశోధనల్లో అందరూ ఆసక్తిగా ఎదురు చూసే ఇంకో ప్రధానమైన అంశం అక్కడ నీరు లేక జీవం జాడేమైనా ఉందా అని.. దాని గురించి నీకే బాగా తెల్సు...

ఊ.. నీరు ఉందా లేదా అన్నది ముఖ్యంగా అక్కడ జీవం ఉందా లేదా అని తెలుసుకోవడానికే. అంటే నీరు ఉన్నంత మాత్రాన జీవం ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పలేం కానీ... అసలు భూమి మీద మొదట జీవం ఉద్భవించింది నీటిలోనే, నీరు ఏర్పడ్డాకే జీవం ఏర్పడటానికి అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయని జీవపరిణామ శాస్త్రజ్ఞులు చెప్తారు కదా.. కాబట్టి, ఎక్కడైనా నీరు అంటూ ఉంటే జీవం ఏర్పడి ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జీవం అంటే గుర్తొచ్చింది.. ఎప్పటినుండో నన్ను వేధిస్తున్న ఒక ఇంటెరెస్టింగ్ ప్రశ్న అడగనా..

ఏంటది ?

ఇంగ్లీష్ సినిమాల్లో చూపించినట్టు ఈ ఏలియన్స్ (గ్రహాంతర వాసులు) అనేవాళ్ళు నిజంగా ఉన్నారంటావా? ఉంటే ఎక్కడ ఉండి ఉండొచ్చు? వాళ్ళు చూడటానికి ఎలా ఉండొచ్చు? సినిమాల్లో చూపించినట్టు భయంకరంగా పిశాచాల్లా ఉంటారా? వాళ్ళ శరీరాలు దేనితో తయారై ఉండొచ్చు? మనలా రక్తమాంసాలతోనే ఉంటారా? ఉంటే గింటే వాళ్ళు ఈ ఏలియన్స్ సినిమాల్లో చూపించినట్టు అంత ఇంటెలిజెంట్సా.. మనకన్నా సాంకేతికపరంగా అడ్వాన్స్‌డా? ఒకవేళ ఏలియన్స్‌ని మనం కలిస్తే దానివల్ల మనకి లాభమా నష్టమా?




(ఇంకా ఉంది) 
మంచు & మధుర  

DISCLAIMER:
All content provided on this blog is for informational purposes only. The owner of this blog and authors of this post make no representations as to the accuracy or completeness of any information on this site or found by following any link on this site.  Photo courtesy by various websites on internet.

Monday, September 10, 2012

అంతరిక్షంలో నువ్వూ నేనూ (Part 1/4): మార్స్ వరకూ వెళ్ళొద్దాం

***శ్రీ రామ***





హే... నిన్న రాత్రి నాకో కలొచ్చింది. భలే చిత్రమైన కల తెల్సా..

ఊ.. చెప్పు.. ఏంటా కల? 

మరేమో.. నేను ఎక్కడో ఉన్నానంట.. చుట్టూ చూస్తుంటే అంతా కొత్తకొత్తగా అనిపించింది..

హిహిహి.. అంటే 'జూ' లో ఉన్నట్టా.. :-)

ఇలా అయితే నేను చెప్పనసలు... :-(

సర్లే నవ్వనులే చెప్పు... 

మరేమో.. ఏం చెప్తున్నాను.. ఆ.. అదే నేను కళ్ళు తెరిచి చూసేసరికి చుట్టూ అంతా  కొత్తగా వింతగా అనిపించింది.

అదేంటి.. నిద్రలో నుండి కళ్ళు తెరిచి చూస్తే మీ ఇల్లే కదా కనపడాలి.. కొత్త కొత్తగా ఎందుకు అనిపించింది?

ఈ ఈ ఈ ఈ.. &;;@*!)#*(#@........................................

సర్లే సర్లే చెప్పు.. ఇక మధ్యలో అడ్డుపడను.. :-)

కళ్ళు తెరిచేసరికి చుట్టూరా కనుచూపుమేరా లేత ఎరుపు రంగులో మెత్తటి ఇసుక తిన్నెలు పరుచుకుని ఉన్నాయి. ఇసుకలో అక్కడక్కడా పాతుకుపోయిన బండరాళ్ళూ, దూరంగా కాస్త మసగ్గా కనిపిస్తున్న ఎత్తైన పర్వతాలూ అన్నీ కూడా ఎర్రగానే ఉన్నాయి. పైనుంచి పడుతోన్న ఎండ ఆ ఎర్రటి ఎడారిని మరింత వెలిగిస్తోంది. అసలా వెలుగు రేఖల స్పర్శకి బంగారు ఛాయలో మెరిసిపోతున్న దూరపు కొండల వైపు చూస్తుంటే, ఓ.. మాటకి ముందు 'బంగారుకొండ' అని అంటూ ఉంటాం కదా.. బహుశా వీటిని చూసే ఆ పదం పుట్టిందేమో.. అన్న ఊహకి నవ్వొచ్చింది. నిజంగానే అదేదో కొత్త బంగారు లోకం గానీ కాదు కదా! చిత్రంగా ఆ ఎర్రటి ఎడారిలో పట్టపగలే అంత ఎండలోనూ వణికిస్తున్న చలి.. కంటికి కనిపించకుండా అదృశ్యంగా దాగిన మంచు తెరల్లో చుట్టేసినట్టు ఒక చల్లచల్లని వింత అనుభూతి తెలుస్తోంది. ఆకాశం వైపు చూస్తే కాస్త మసక మసగ్గా ఉంది. తెలతెల్లని మబ్బుల జాడే లేకుండా ఆకాశమంతా లేత ఎరుపు రంగులో ఉంది. నా అయోమయాన్ని కాస్త తేలికపరుస్తూ సూర్యుడు కంటపడ్డాడు. రోజూకన్నా కాస్తంత సన్నబడ్డట్టు, రంగు తగ్గినట్టు, మెరుపు తగ్గినట్టు అనిపించింది. తర్వాత కాసేపటికి సూర్యాస్తమయం అయిపోయింది. సూరీడు ఆ ఎర్రటి కొండల ఒడిలోకి పూర్తిగా జారిపోయి ఆకాశాన్ని చీకట్లో నింపేశాడు. నేను కంగారుపడేంతలో ఆకాశంలో బోల్డన్ని చుక్కలు, చందమామ కనిపించాయి. చంద్రుడి చుట్టూ అలలు అలలుగా ఏర్పడిన గాలి గుళ్ళు భలే ఉన్నాయే అనుకుంటుండగానే ఇంకో చిన్న చందమామ లాంటిది కనిపించింది. ఇద్దరు చంద్రుళ్ళా.. ఇది కలా నిజమా అనుకుంటున్నాను. ఇంతలో...

ఆగాగు... నువ్వు చెప్పేది వింటుంటే నాకొకటి గుర్తొస్తోంది. కానీ, ముందు ఈ ఫోటో చూసి నువ్వు కలలో చూసింది ఇంచుమించు ఇలా ఉందేమో చెప్పు.

మార్స్ మీద ట్విన్ పీక్స్ పర్వతాలు

హే... అవును... ఇలానే ఉంది అక్కడంతా.. భలే కనిపెట్టావే...

అయితే ఈ మధ్య నువ్వు న్యూస్ బాగా ఫాలో అవుతున్నట్టున్నావ్ గా..

ఊ.. ఈ మధ్య నాసా వాళ్ళు మార్స్ మీదకి ఒక రాకెట్‌ని పంపించారు కదా.. దాని గురించి కొంచెం శ్రద్ధగానే ఫాలో అవుతున్నాలే.. :-)  అవునూ.. మన వాళ్ళు ఎప్పటినుంచో వేరే గ్రహాల మీదకి చాలా రాకెట్లు పంపిస్తూనే ఉన్నారు కదా.. మరి దీనికెందుకు ఇప్పుడు అంత స్పెషల్ కవరేజ్ వచ్చింది?

ఆర్బిటర్
గత యాభై సంవత్సరాలుగా ఒక్క మార్స్ మీదకనే కాదు కానీ రకరకాల అంతరిక్ష పరిశోధనల కోసం రోదసిలోకి చాలానే రాకెట్లూ, రోబోలూ పంపిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మార్స్ మీదకు పంపినది గతంలో వాటన్నింటికన్నా కొంచెం ఎక్కువ క్లిష్టమైనది. ఒక్క మార్స్ మీద పరిశోధనల వరకూ తీసుకుంటే, మొదట్లో రాకెట్ల ద్వారా శాటిలైట్లని రోదసిలోకి పంపించి మార్స్ యొక్క కక్ష్య (ఆర్బిట్) లోకి ప్రవేశపెట్టేవారు. ఆ శాటిలైట్స్ మార్స్ చుట్టూ ఒక నిర్దిష్ట  కక్ష్యలో తిరుగుతూ మార్స్‌ని ఫోటోలు తీస్తూ ఆ ఫోటోలు భూమి మీద ఉన్న కంట్రోల్ రూంకి పంపించేవి. ఇవి ఒక ఆర్బిట్ లో గ్రహం చుట్టూ తిరుగుతాయి కాబట్టి వీటిని ఆర్బిటర్లు అంటారు.

అంటే ఇవి మన భూమి కక్ష్యలో తిరుగుతూ మనకి శాటిలైట్ టీవి ప్రసారాలకి, జిపిఎస్‌లకు  ఉపయోగపడే శాటిలైట్ల లాంటివేనా?

ఊ.. అదే తరహాలో ఉంటాయి. మన ఇస్రో (ISRO) వాళ్ళు తరచుగా పంపే శాటిలైట్లు కూడా ఈ అర్బిటర్ లాంటివే, కాకపోతే అవి మన భూమి చుట్టూ ఆర్బిట్‌లో తిరిగేవి. మార్స్ మీద ఎక్కడెక్కడ ఖనిజ సంపద, నీరు లేక జీవము ఉండే అవకాశం ఉండొచ్చు లాంటి విషయాల మీద అధ్యయనం చెయ్యడానికి ఇలాంటి ఆర్బిటర్లు తీసిన ఫోటోలు బాగా ఉపయోగపడతాయి.

ఒక గ్రహకక్ష్యలో తిరుగుతూ పరిశోధనలు చేసే శాటిలైట్లను రూపొందించడంలో మనకి ఇప్పటికే మంచి అనుభవం ఉంది కాబట్టి ఇది చాలా సులభమైనది మరియు తక్కువ రిస్కు ఉన్న పద్ధతి అనుకుంటా.. అంతేనా?


మార్స్ మీద ఫీనిక్స్ ల్యాండర్
అవును. ఈ ఆర్బిటర్లు తీసిన మార్స్ ఫోటోలు బాగా అధ్యయనం చేసి అక్కడ దిగడానికి అనువైన మరియు మనకి ఎక్కువ సమాచారం దొరుకుతుంది అనుకొన్న కొన్ని ప్రదేశాలు ఎంపిక చేసి అక్కడికి కొన్ని రోబోలను పంపించారు. ల్యాండర్ అని పిలిచే ఈ తరహా రోబోలు స్థిరంగా ఒకచోట ల్యాండ్ అయ్యి వివిధ రకాల పరిశోధనలు చేసే చిన్న పరిశోధనశాలలు అనుకోవచ్చు. ఇవి ఎక్కడ దిగితే అక్కడ సెటిల్ అయ్యి దాని చుట్టూ ఉన్న ప్రదేశాన్ని ఫోటోలు తీసి మనకి పంపిస్తాయి. అలాగే చుట్టుపక్కల ఉన్న రాళ్ళు, మట్టి లాంటివి సేకరించి ఆ స్టేషన్ లో పరిశోధనలు చేస్తాయి.
క్యూరియాసిటి రోవర్
తరువాత రోవర్ అని ఇంకోరకం రోబోలను రూపొందించారు. ఇదయితే ల్యాండర్‌లా దిగిన చోటే స్థిరంగా ఉండిపోకుండా వాటికున్న చక్రాలతో కొంత దూరం తిరగగలిగే సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా పంపినది ఈ రోవర్ తరహా రోబోనే. సుమారు మన మారుతి కారు అంత పరిమాణంలో ఉండేఈ రోవర్ పేరు క్యూరియాసిటి.




క్యూరియాసిటినా.. భలే ముద్దుగా ఉంది కదా దీని పేరు.. :-) సరే కానీ నాకో సందేహం ఇక్కడ... ఎప్పటినుండో మనముంటున్న భూమి యొక్క వాతారణ పరిస్థితులే సరిగ్గా అంచనా వెయ్యలేక డిజైన్ ఫెయిల్ అయ్యి ఘోరమయిన ప్రమాదాలు తప్పించుకోలేకపోయాం కదా! ఉదాహరణకి మన కల్పనా చావ్లాతో సహా ఏడుగురు వ్యోమగాములను కోల్పోయిన కొలంబియా స్పేస్‌షటిల్‌కి జరిగిన ప్రమాదం వంటిది. మరి అలాంటిది అసలు మార్స్ మీద ఉష్ణోగ్రత, వాతావరణ పీడనం, తేమశాతం, గురుత్వాకర్షణ శక్తి లాంటి వివరాలు ఏమీ మనకి ముందు తెలీవు కదా.. అక్కడికి మనం పంపే పరిశోధన స్టేషన్లు, రోబోలూ సరిగ్గా పనిచేసేలా వాటిని ఎలా రూపొందిస్తారు? అసలు అక్కడి పరిస్థితుల గురించి ఏ మాత్రం అవగాహన లేకుండా ఈ ల్యాండర్లు, రోవర్లను మార్స్ మీద ఎలా దింపుతారు?

ల్యాండ్ చెయ్యడానికి ఉపయోగించిన ఎయిర్ బెలూన్లు
మొదటిసారి పంపినప్పుడు అక్కడి పరిస్థితులు అన్నీ కేవలం ఊహించి డిజైన్ చేసినవే.. అయితే మనం పంపిన మొదటి ల్యాండర్ అక్కడి నుంచి పంపిన సమాచారం తరువాత పంపే రోబోలకి బాగా ఉపయోగపడింది. ఇక వాటిని అక్కడ ల్యాండ్ చెయ్యడం సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూపించినట్టు చాలా ఇంటరెస్టింగ్‌గా ఉంటుంది. మొదట్లో తక్కువ బరువున్న చిన్న చిన్న ల్యాండర్లు, రోవర్లు పంపినప్పుడు ఎయిర్ బెలూన్లలో ప్యాక్ చేసి మార్స్ మీద ఒక నిర్ణీత ఎత్తు వరకు ప్యారాచూట్లో దింపాక అక్కడనుండి వదిలేవారు. ఆ బెలూన్లు ఈ ల్యాండర్లకి కుషన్ గా పని చేసి ఎంత ఫోర్స్ తో కింద పడినా సరే సమస్య లేకుండా ఉండేది.  కానీ నెక్స్ట్ జనరేషన్ రోబోలు బరువు ఎక్కువ ఉండటంతో ఈ బెలూన్ పద్ధతి సరిపోక వేరే ఒక కొత్త, మరింత సంక్లిష్టమయిన పద్ధతిని రూపొందించి ఉపయోగించాల్సి వచ్చింది. బెలూన్ పద్ధతిలో ల్యాండింగ్ చెయ్యడం ఇక్కడ, క్యురియాసిటి ల్యాండ్ చేసిన సరికొత్త పద్ధతి ఇక్కడ చూడు.

భలే ఉన్నాయిగా ఇవి. ఇలాంటి క్లిష్టమయినవి డిజైన్ చెయ్యాలంటే ఎంత కష్టమో.. అసలు ఎన్నాళ్ళు కష్టపడతారో కదా వీళ్ళు..

క్యూరియాసిటి ల్యాండింగ్
అంతరిక్ష పరిశోధన అధిక ఖర్చు మరియు రిస్క్‌తో కూడుకున్నది. కోట్ల కొద్దీ డబ్బు, సంవత్సరాల తరబడి పడ్డ కష్టం, ప్రపంచ మీడియా ఫోకస్, దేశప్రతిష్ఠ, స్పేస్ రీసెర్చ్ యొక్క భవిష్యత్తు, బడ్జెట్లో ప్రభుత్వం కేటాయించే నిధులు, ఆ ప్రాజెక్ట్ లో పనిచేసిన ఇంజనీర్ల కెరీర్లు ఇవన్నీ ఒక పక్క ఒత్తిడి పెంచే అంశాలు. ఇంకో పక్క ఎన్నడూ అక్కడికి వెళ్ళిన అనుభవం లేకపోవడంతో కేవలం అక్కడి పరిస్థితులు ఊహించి డిజైన్ చెయ్యాల్సి రావడం... హ్మ్మ్.. మొత్తంగా it's a quite challenging job. ఈ పరిశోధనలో ఇంత రిస్క్ ఉన్నా సరే ఏదైనా చిన్న పొరబాటు జరిగితే ప్రజలు, మీడియా రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుగా..

ఎందుకు తెలీదూ.. ఒకసారి చెప్పావ్ కదా... హబుల్ టెలిస్కోప్ లెన్స్‌లో జరిగిన పొరపాటు వల్ల అది మసకగా ఉన్న ఫోటోలు పంపుతుండటంతో దాన్ని పంపిన నాసా ఎంత నవ్వుల పాలయిందో..

అసలు అందులో జరిగిన తప్పు ఎంత చిన్నదో తెలుసా.. ఆ టెలిస్కోప్ లో ఒక లెన్స్ ఉండాల్సిన చోట కన్నా జస్ట్ 1.3 మిల్లీమీటర్లు పక్కకి జరిగింది. దాని ఫలితం ఈ టెలిస్కోప్‌ని తయారు చెయ్యడానికి ఖర్చయిన పన్నెండు వేల కోట్ల రూపాయలు బూడిదలో పోసినట్టే అనుకున్నారు. కొన్నాళ్ళ తరువాత దానికి మళ్ళీ కొన్ని రిపేర్లు చెయ్యడం, అది పంపించే మసక చిత్రాలను అప్పటికి బాగా డెవలప్ అయిన లేటెస్ట్ ఇమేజ్ ప్రాసెస్సింగ్ టెక్నిక్లతో మళ్ళీ క్లియర్‌గా మార్చగలగడంతో ఆ టెలిస్కోప్ ఉపయోగపడగలిగింది గానీ లేకపోతే ఆ పొరపాటు ఎప్పటికీ నాసా ప్రతిష్ఠకి మాయని మచ్చగా మిగిలిపోయుండేది. ఇక ఈ రోబోలని తయారు చెయ్యడం, పంపడం పక్కన పెడితే, అది అక్కడి నుంచి వివిధ రకాలయిన డేటా పంపించే సమయంలో ఇక్కడ భూమి మీద ఉన్న కంట్రోల్ రూంలో ఉండే శాస్త్రజ్ఞుల కష్టాలు చూడాలి అసలు..

ఎంచక్కా అక్కడ నుంచి రోబో డేటా అంతా సేకరించి ఇక్కడికి పంపిస్తుంటే వీళ్ళు హాయిగా ల్యాబ్లో అనలైజ్ చేస్కోడమే కదా.. అందులో పెద్ద కష్టాలు ఏముంటాయంటావ్?

ఉండు.. అక్కడే ఒక ట్విస్ట్ ఉంది. మన భూమి మీద రోజుకి 24 గంటలు అయితే అదే మార్స్ మీద రోజుకి 24 గంటల 40 నిముషాలు. అంటే ఈ రోజు మార్స్ మీద ఉదయం 7 అయినప్పుడు భూమి మీద ఉదయం 7 అయిందనుకో, రేపు మార్స్ మీద ఉదయం 7 అయినప్పుడు భూమి మీద 7:40 అవుతుంది. అదే ఎల్లుండి మార్స్ మీద ఉదయం 7 అయినప్పుడు భూమి మీద 8:20 అవుతుంది. ఇలా భూమి మీద టైంకి మార్స్ మీద టైంకి మధ్య ఉన్న వ్యత్యాసం రోజుకి నలభై నిముషాల చొప్పున పెరుగుతూ ఉంటుందన్నమాట.

ఊ.. అర్థమయ్యింది.. కానీ దీంట్లో ఉన్న ట్విస్ట్ ఏంటో తెలియట్లేదు..

ఉండు చెప్తా.. ఈ రోబోలు పని చెయ్యడానికి శక్తి కావాలి కదా.. ఆ శక్తి ఉత్పత్తి చెయ్యడానికి సోలార్ విద్యుత్ ఒక్కటే అనువైనది. అందువల్ల ఈ రోబోలు కేవలం పగలు సూర్యుడు ఉన్నప్పుడే పని చేస్తాయి. కాబట్టి భూమి మీద నుండి ఈ రోబోలను లైవ్ లో కంట్రోల్ చేస్తూ పని చేసే సైంటిస్ట్‌లు ఇక్కడ ఉన్నా మార్స్ టైం ప్రకారమే పని చెయ్యాలి. ఇప్పుడు మార్స్ టైం ప్రకారం ప్రతీరోజూ ఉదయం 7 గంటలకు పని మొదలు పెట్టాలనుకో.. ఇక్కడ భూమి మీద వాళ్ళ పనిదినం మొదలయ్యే సమయం రోజురోజుకీ 40 నిముషాలు ఆలస్యం అవుతూ పోతుంది. అంటే వాళ్ళు మొదటి రోజు ఉదయం 7 కి పని మొదలు పెడితే, రెండో రోజు 7:40 కి, మూడో రోజు 8:20 కి అలా ఒక 10 రోజుల తరువాత మధ్యాహ్నం ఒంటిగంటకి, అదే నెల తరువాత తెల్లవారుజామున 3 గంటలకి మొదలు పెట్టాలి. ఇలా రోజు రోజుకీ పని గంటలు మారిపోవడం వల్ల వాళ్ళ దినచర్యలో చాలా తేడా వచ్చేసి త్వరగా అనారోగ్యం పాలవుతారట. ఈ కారణాలవల్లే క్యూరియాసిటి రొవర్‌లొ అధికబరువు ఉన్నా న్యూక్లియర్ బ్యాటరీల వైపు మొగ్గుచూపారు.

ప్చ్.. పాపం కదా.. అయినా ఇలాంటి పరిశోధనలు చేసే సైంటిస్టులకి ఎంత శ్రద్ధ, కార్యదీక్ష కదా అసలు.. భలే ఇన్స్పైరింగ్ గా అనిపిస్తోందిలే వింటుంటేనే..

అదొక్కటనే కాదు.. ఈ రోబోల జీవితకాలం మహా అయితే రెండు మూడు నెలలు. అందులో ప్రతీ గంటా మనకి చాలా ముఖ్యమైనది. అందుకని వీళ్ళు నిద్రపోయే కొన్ని గంటలు తప్ప మిగతా సమయం అంతా పనిచేస్తూనే ఉంటారు. వీళ్ళకి రాత్రి, పగలు తేడా తెలిస్తే చీకటి పడేసరికి నిద్రొచ్చేస్తుందని బయటి ప్రపంచం అంతా కనపడకుండా కర్టెన్స్ వేసేసి కేవలం లైట్ వెలుగులో పని చేస్తారు తెలుసా..

వావ్.. అసలు సిసలైన రీసెర్చ్ మోటివేషన్ అంటే ఇదీ.. :-) అయినా.. ఇదంతా బానే ఉంది గానీ, అసలు ఇంత కష్టపడి ఈ పరిశోధనలన్నీ ఎందుకంటావ్? నాసా వాళ్ళు ఏదో రోబో పంపారు, అది విజయవంతంగా ల్యాండ్ అయ్యింది, అవి ఇవి పరిశోధనలు చేస్తుంది. ఇదంతా సరే.. కానీ, అసలు అంతంత ఖర్చు పెట్టి ఈ అంతరిక్ష పరిశోధనలు ఎందుకోసం? నీకు తెలుసా.. ఇప్పటి వరకు కేవలం మార్స్ మీదకి పంపిన మూడు రోబోలకి ఇంచుమించు ఇరవై వేల కోట్ల రూపాయల ఖర్చు అయ్యిందట. ఇప్పుడు పంపిన క్యూరియాసిటి ఖరీదే దాదాపు పన్నెండువేల కోట్ల రూపాయలు.. దీన్నిబట్టి మిగతా రోదసియాత్రలకు, పరిశోధనలకు ఎన్నెన్ని కోట్లు ఖర్చు అవుతుందో ఊహించుకోవచ్చు. ఇంతింత డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ మనం సాధించేది ఏమిటి? అక్కడ ఏమి ఉంటే మనకేంటి, లేకపోతే మనకేంటి.. అదే డబ్బుతో బోలెడన్ని మంచి అభివృద్ధి పనులు ఇక్కడే చెయ్యవచ్చు కదా.. ఆ పరిశోధనలు ఏవో భూమి మీద చేస్తే దాని ఫలితాలు ప్రజలకు వెంటనే అందుతాయి కదా.. ముఖ్యంగా మన భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల గురించి నేను అడిగేది.

హ్మ్.. మంచి ప్రశ్న..


(ఇంకా ఉంది)
  
- మంచు & మధుర


DISCLAIMER:
All content provided on this blog is for informational purposes only. The owner of this blog and authors of this post make no representations as to the accuracy or completeness of any information on this site or found by following any link on this site.  Photo courtesy by various websites on internet.