Pages

Thursday, March 29, 2012

తిండి గొడవలు (Part 2 of 4) - మతం చెప్పిందే వేదమా ?

*** శ్రీ రామ ***
ఒకసారి నా కొలీగ్ ఒకడు భారతీయ హిందువుల్లో అధిక శాతం శాకాహారులే ఎందుకు ఉంటారు, మాంసాహారం తినే కొద్దిమంది హిందువులు కూడా బీఫ్ (ఆవు)ని ఎందుకు తినరు అని అడిగాడు. అతను అన్నట్టు హిందువుల్లో మెజారిటీ శాకాహారులు అన్నది తప్పేమో కానీ మాంసాహారం తినేవాళ్ళలో మాత్రం చాలామంది బీఫ్ తినడానికి ఇష్టపడరనేది నిజమే కదా.

అసలు ఒక మనిషి శాకాహారిగా లేక మాంసాహారిగా బ్రతకాలని ఎప్పుడు ఎవరు నిర్ణయిస్తారు అన్నది ఒకసారి చూస్తే, 99 శాతం కేసుల్లో అది వారు పుట్టిన కుటుంబ నేపథ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఆ మనిషి శాకాహారుల ఇంట్లో పుడితే శాకాహారి, లేకపోతే మాంసాహారి అవుతాడు. అంతే కానీ తనకు తాను ఇష్టపడి కోరి తన ఆహారపు అలవాట్లు మార్చుకున్న సందర్భాలు తక్కువే ఉంటాయి. కొంతమంది మాంసాహారులు ఆరోగ్యపరమయిన కారణాల వల్ల అయితేనేమి, వేగన్స్ లా మిగతా జంతుజాలం పట్ల ఉన్న కన్సర్న్ వల్ల అయితేనేమి , లేక జీవిత భాగస్వామి వెజ్ అవడం వల్ల లేక సింపుల్ గా తినడం సహించక శాకాహారులుగా మారడం ఈ మధ్య కొంచెం తరచుగానే చూస్తున్నాం కానీ చిన్నప్పటినుండి శాకాహారుల ఇంట్లో పుట్టి పెరిగి కాలేజికి వెళ్ళాకో లేక పరాయి దేశం వెళ్ళాకో లేక నాన్ వెజ్ జీవిత భాగస్వామి వల్లొ మాంసాహారులగా మారడం మాత్రం చాలా తక్కువనే చెప్పుకోవాలి.

మనిషి ఆహారపు అలవాట్ల మీద తను నమ్మే మతం యొక్క ప్రభావం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి హిందువుల్లో అధికశాతం శాకాహారులుగా జీవించడానికి మతం (కొన్ని కులాల వారికే అనుకోండి) ముఖ్య కారణం ఇంకా చెప్పాలంటే ఏకైక కారణం. అలాగే మాంసాహారం తినే హిందువుల్లో కూడా చాలామంది బీఫ్ తినకపోవడానికి కూడా "ఆవు మనకి చాలా పవిత్రమయిన జంతువు, గోహత్య మహాపాతకం " అన్న మతపరమయిన నమ్మకం కూడా ఒక కారణం. హిందువుల్లో కూడా ఒకానొక సమయంలో మాంసాహారం  (ఆవుమాంసంతో) సహా తినేవారు అని చాలా మంది వినేవుంటారు. అలాగే చాలా తెగలలో లానే జంతు బలులు కు  హిందూమతం వ్యతిరేకం కాదు. పూర్వాకాలంలో యజ్ఞయాగాదులు నిర్వహించినప్పుడు చివర్లో జంతువులని బలి ఇచ్చి ఆ మాంసాన్ని పంక్తి లో అందరితో కలసి భుజించేవారని కూడా వినే ఉంటారు. మరి అలాంటిది ఎప్పుడు కొంతమంది హిందువులు ఇలా పూర్తి స్థాయి శాకాహారానికి మారిపోయారు అన్న ప్రశ్న రావచ్చు. అలాగే సడన్ గా "గోహత్య మహాపాతకం" అన్న కాన్సెప్ట్ ఎందుకు పుట్టింది అని. 

ఆహారపుటలవాట్లకి సంబంధించిన విషయాల్లో ఉండే ప్రతీ మతపరమయిన ఆంక్షల వెనుక సమాజానికి మంచి చేసే (కనీసం అప్పటి పరిస్థితులకి సరి అయినది) అంశం ఉంటుంది అని నా నమ్మకం. అసలు ఆహారపు అలవాట్లనే కాదు మతపరమయిన ఏ నియమనిభందనల వెనుకయినా సాంఘీక సంక్షేమమో , ప్రకృతి రక్షణొ లేక బలమైన వర్గాలకి చెందినవారికి లాభం కలిగించే స్వార్ధపరమయిన కుట్రొ .... ఇలాంటి కారణం ఏదో ఒకటి ఖచ్చితం గా ఉంటుంది కానీ కేవలం దేవుడికి ఇది ఇష్టం ఉంటుంది అని ర్యాండం గా ఊహించి అయితే మాత్రం ఉండదు అని నా అభిప్రాయం.

ఇంకో రకంగా చెప్పాలంటే సమాజంలో ఎక్కువమంది దేవుడిని నమ్మేవారు ఉంటారు కాబట్టి ఏదయినా ఒక నియమం అందరూ పాటించేలా చెయ్యాలంటే దానికి మతపరమయిన లంకె ఒకటి అటాచ్ చేస్తే బాగా వర్కవుట్ అవుతుంది అన్నమాట. హిందూ మతమనే కాదు ప్రతీ మతంలో తాము తినే ఆహారానికి సంబంధించి కొన్ని నియమనిబంధనలు ఉంటాయి.

ఉదాహరణకి కొంతమంది క్రైస్తవులు శుక్రవారం కేవలం చేపలు మాత్రమే తింటారు. పూర్వాకాలంలో ఒకానొకప్పుడు ప్రజలందరూ రెడ్ మీట్ (బీఫ్ లాంటివి) తినడానికి బాగా అలవాటు పడి చేపలు తినడం బాగా తగ్గించేసారట. అదే జీవనాధారంగా బ్రతుకుతున్న మత్స్యకారుల సంపాదన తగ్గి జీవనం కష్టం అవడంతో వాళ్ళు వెళ్ళి అప్పటి మతాధికారులకి మొరపెట్టుకున్నారట. వీళ్ళను ఆదుకోవాలంటే ప్రజల చేత కనీసం అప్పుడప్పుడు అయినా చేపలు తినేలా చెయ్యాలి. మరి రుచికరమయిన రెడ్ మీట్ వదిలేసి చేపలు తినమని చెప్తే ఎవరు తింటారు. అప్పుడు పుట్టిందే ఈ శుక్రవారం చేపల రూల్ అన్నమాట. వారంలో మనం చేసే పాపాలు తొలగిపోయి పరిశుద్ధంగా ఉండాలి అంటే వారంలో ఒక రోజు ఉపవాసం చెయ్యాలని, జీసస్ చనిపోయింది శుక్రవారం కాబట్టి ఆ రోజు ఉపవాసం చెయ్యడానికి సరైన రోజు అని మతాధికారులు కొత్త సంగతి చెప్పారన్నమాట. వాళ్ళకి చేపలు మాంసాహారం క్రిందకి రాదు కాబట్టి చేపలు తినడం వారికి ఉపవాసం క్రిందే లెక్క.
పైన చెప్పుకున్నది సంఘంలో ఒక వర్గానికి చెందిన ప్రజలను ఆదుకోవడం కోసం పుట్టిన మతపరమయిన నిబంధన. అలాగే ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ఆహారపుటలవాట్లలో ఆంక్షలు విధిస్తూ పుట్టిన మతపరమయిన నియమాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి ముస్లింల హలాల్ పద్ధతి.
ముస్లింలలో వాళ్ళు తినబోయే జంతువులను ఎంచుకోవడానికి, వాటిని చంపే విధానానికి సంభందించి కొన్ని ఖచ్చితమయిన నిబంధనలున్నాయి. ఈ నిబంధల ప్రకారం చంపినవే తినడానికి అర్హత పొందుతాయి (హలాల్) లేకపోతే అవి తినడానికి అనర్హం (హరాం) అన్నమాట. ఈ నియమాలు కొన్ని విశ్లేషిస్తే మనకి వాటి వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ కూడా కనిపిస్తాయి. ఉదాహరణకి 



  • చంపబోయే జంతువుని (చేప తప్ప) జాగ్రత్తగా పట్టుకుని పక్కకు పడుకోబెట్టి పదునయిన చాకు తీసుకుని దాని jugular veins మాత్రం జాగ్రత్తగా కోసి రక్తం అంతా పోయేవరకు ఉంచి అప్పుడు మిగతా భాగాలు కొయ్యాలి. పైన "జాగ్రత్తగా" పట్టుకుని అని రాసింది వెటకారం కాదు. నిజంగానే చాలా సున్నితంగా హేండిల్ చేస్తారు. రక్తంలో యూరిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి రక్తం ఉన్నమాంసం తినడం ఆరోగ్యానికి మంచిది కాదని ఆ నిబంధ పెట్టి ఉంటారు అని కొంతమంది నమ్మకం.
  • అలాగే పంది మరియు మాంసాహారం తినే పక్షులు (గ్రద్ద) లాంటివి తినకూడదు అని ఇంకో నిబంధ ఉంది. దీనికి రెండు కారణాలు వాడుక లో ఉన్నాయి. ఒకటి... పైన చెప్పినట్టు ఆ jugular veins మాత్రమే కొయ్యడం పంది యొక్క శరీరాకృతితో కుదరదు (మెడ లావుగా ఉండటం వల్ల). అందువల్ల ముస్లింలలో కొందరు ఏమంటారంటే... "ఈ జంతువు తినొచ్చు అని దేవుడు అనుకుంటే దాని మెడ కూడా మేక, కోడిలా సన్నగా పెట్టకుండా ఇలా లావుగా పెట్టి jugular veins కొయ్యడం కుదరకుండా చెయ్యడు కదా... అందువల్ల మనం తినకూడదు" అని. రెండో కారణం అయితే పంది అపరిశుభ్రమయిన ప్రదేశాల్లో ఎక్కువ నివసిస్తుంది కాబట్టి, పంది మీద చాలా పేరాసైట్స్ నివాసం ఉంటాయి. అందువల్ల పందిని తింటే ఆ పేరాసైట్స్ మనుషులకి రోగకారణం అవుతాయి కాబట్టి పందిని తినకూడదు అని. నాకు కాస్త ప్రాక్టికల్ అనిపించేది రెండో కారణమే.
  • అలాగే ఆల్రెడీ చనిపోయిన జంతువులు తినకూడదు అన్న ఇంకో నియమం ఉంది.  దానికి    "ఆ చనిపోయిన జంతువు ఏ జబ్బుతో చనిపోయిందో తెలీదు కాబట్టి తెలీకుండా తింటే ఆ జబ్బు మనుషులకి అంటుకుంటుంది" అన్న లాజిక్ కనిపిస్తుంది.
  • వేరే జంతువులు వేటాడి కొంచెం తిని వదిలేసిన మాంసం మనం తినకూడదు అన్న ఇంకో నియమం "ఆ వేటాడి తిన్న జంతువుల నోటిలో రేబిస్ లాంటి వైరస్ ఉండి అది తరువాత ఆ మిగులు మాంసం తిన్నవారికి సోకవచ్చు" అన్న కారణంతోనూ, ఇలా హలాల్ లో ప్రతీ నిబంధనకి అనేక రకాల కారణాలు వెతకొచ్చు. 
వాటిలో కొన్ని ఇప్పటి పరిస్థితులకి వర్తించకపోవచ్చు, అసమంజసంగా అనిపించవచ్చు. అన్నీ ఆంక్షలకి సవరణలు ఉన్నట్టు హలాల్ కి కూడా ఒక మినహాయింపు ఉంటుంది. హలాల్ మీట్ దొరక్కపోతే నాన్ హలాల్ మీట్ తినొచ్చు అని ఖురాన్ లోనే రాసి ఉంది. ఇంచుమించు ఇవే కారణాలతో యూదులు పంది, షెల్ ఫిష్ (రొయ్యలు, lobster , పీతలు) లాంటివి తినరు. యూదుల కోషర్ ఫుడ్ మరిన్నిరూల్స్ తో నిండిఉంటుంది.
ఇవన్నీ చూసి నాకేమనిపిస్తుంది అంటే... మన హిందూమతం లో కూడా పూర్వకాలంలో బీఫ్ తిన్నా కూడా తరువాతి కాలంలో ఆవు యొక్క ఉపయోగాలు (పాలు మరియూ పాల ఉత్పత్తులు) దృష్టిలో పెట్టుకుని ఆవుల జాతి అంతరించిపోకుండా కాపాడటానికి, మాంసం కోసం ఆవుల్ని చంపడాన్ని అదుపులో ఉంచడం కోసం మతం పేరుతో ఒక నిభందన పెట్టి ఉంటారు. గోవుకి మన పురాణాల్లో కామధేనువనే స్థానం ఎలాగూ ఉంది కాబట్టి అది ఉపయోగించుకుని రెండూ కలసి వచ్చేలా పెట్టి ఉంటారు. గోహత్య మహాపాతకం, జంతుబలులు , చంపి దేవుడి కి ఆఫర్ చేస్తే తప్పులేదు, అహింస ఇవన్ని అసలు ఎందుకో అతికినట్టు అనిపించవు.



పైన చెప్పుకున్న ఉదాహరణలు అన్నీ చూసాక ఏ మతం పెట్టిన నియమనిభందనలు అయినా అవి  అప్పటి ప్రజల ఆరోగ్యాన్ని, సాంఘీకసంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పెట్టినట్టు అనిపిస్తుంది కాబట్టి ఆహారపు అలవాట్ల విషయంలో మతం చెప్పిందే వేదం అనుకోవచ్చు. కానీ వాటిలో చాలామటుకు అప్పటి అంటే ఆ రూల్స్ పెట్టే సమయానికి ఉన్న పరిస్తితులకి అనుగుణం గా ఏర్పడినవి. అయితే అవన్నీ ఇప్పుటి పరిస్తితులకి వర్తించాలని లేదు. కొన్ని ఆచార వ్యవహారాలు, నమ్మకాలు మారుతున్నకాలంతో పాటు అనేక సవరణలు దిద్దుబాట్ల తో మారుతూ వస్తున్నాయ్, కొన్ని కనుమరుగైపొయాయ్ కూడా . ఈ నమ్మకాలలో కొన్ని ఈనాటి పరిస్థితులకి వర్తించవు అనిపించినప్పుడు ఆయా నిబంధనలను సవరించడం కూడా తప్పు కాదు. ఎందుకంటే, మానవ మనుగడలో 'మార్పు' అనేది నిరంతరంగా జరిగే ప్రక్రియే. అలా సవరణలు చెయ్యాల్సిన, చేసుకోవాల్సిన అవసరం బాధ్యత అందరిమీదా ఉంటుంది. మన మతంలో ప్రస్తావించారన్న ఏకైక కారణం తో ప్రతీవిషయంలో విచక్షణ లేకుండా గుడ్డిగా అనుసరించాలని లేదు. మతం లో ఉన్న ఏ నియమం అయినా ఒక్కసారి దాని వెనుకున్న లాజికల్ రీజన్ అర్ధం చేసుకుంటే , ఇప్పటి పరిస్తితులలో అది అనుసరించాలో అక్కరలేదో మన కామన్‌సెన్స్ చెప్తుంది. 

- మంచు

Tuesday, March 27, 2012

తిండి గొడవలు (Part 1 of 4) - వెజిటేరియన్స్ నిజంగా జంతు ప్రేమికులా?

*** శ్రీ రామ ***

లాస్ట్ సమ్మర్ లో ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరో పిలిస్తే ఒక బార్బెక్యూ పార్టీకి వెళ్ళాల్సొచ్చింది. అక్కడ కొందరు నేను నాన్‌వెజిటేరియన్ నా లేక ఉత్తి వెజిటేరియన్ నా అని అడగగానే యథావిధిగా కొంచెంసేపు అదోరకమయిన సందిగ్ధావస్థలో పడి తేరుకుని వెజిటేరియన్ అని చెప్పాను. ఇలా అబద్ధం చెప్పడం నాకు కొత్తేమీ కాదనుకోండి. ఓ నాలుగైదు రకాలు తినే కుటుంబ నేపథ్యంలో పుట్టి పెరిగినా ఇప్పుడు క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, జల పుష్పాలు, ఉభయచరజీవులు ఇలా నడిచేవి, ఎగిరేవి, పాకేవి, ఈదేవి ఏదయినా పెద్ద అభ్యంతరం లేదు. ఇలా ఏది పడితే అది తినగలిగినా అసలు నేను నాన్‌వెజిటేరియన్ అని పైకి చెప్పడానికి ఎప్పుడూ ఎందుకు ఇలా మోహమాటపడతానో నాకు అర్థం కాదు. ఇలా అనవసరంగా కమిట్ అయిపోయి బోల్డు సార్లు మంచి మంచి డిషెస్ కూడా మిస్ అయిపోతుంటాను. ఒకప్పుడు ఏవో కొన్ని కారణాల వల్ల ఒక నాలుగు సంవత్సరాలు వెజిటేరియన్ గా ఉన్నా ఆ తరువాత నా వల్ల భూమి మీద జీవరాశుల మధ్య సమతుల్యత దెబ్బతింటుంది అని మళ్ళీ నాన్‌వెజిటేరియన్ గా మారిపోయాను. :-) 

అసలయినా పులులు సింహాల్లా మనుషుల్లో అసలు సిసలు నాన్‌వెజిటేరియన్ అంటూ ఎవరూ ఉండరు. నాన్ వెజిటేరియన్ అని పిలిచేవారంతా Omnivores అన్నమాట. అంటే అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి శాకాహారం లేక మాంసాహారం ఏదయినా తిని బ్రతికే వాళ్ళు.

ఈ వెజిటేరియనిజం అన్నది భలే చిత్రమయిన కాన్సెప్ట్. అంటే వెజిటేరియన్స్ లోనే బోల్డు రకాల వెజిటేరియన్స్ ఉంటారన్నమాట. ఇందులో వేగన్స్ (vegans) అనేవారు నిక్కచ్చైన అసలు సిసలయిన శాకాహారులు. అంటే వీరు కేవలం జంతుమాంసం అనే కాకుండా అసలు జంతువులకి సంబంధించిన ఏ ఆహారాన్నీ తీసుకోరు. పాలు, గుడ్లు, తేనె లాంటి జంతు సంబంధిత ఉత్పత్తులు కూడా వీరికి నిషిద్ధం. అందువల్ల వీరికి వీరు తామే అసలు సిసలయిన వెజిటేరియన్ అని అభివర్ణించుకోవడం పెద్ద అతిశయోక్తి అనిపించదు. వీరి ఫిలాసఫీ ప్రకారం జంతువులకి సంబంధించినవి ఏదయినా కేవలం ఆ జంతువులకే చెందాలి, అవే ఉపయోగించుకోవాలి కానీ అది మనిషి బలవంతంగా తీసుకోవడం వాటి హక్కులని హరించడమే అని వీరి అభిప్రాయం. వీరి దృష్టిలో మన ఆహ్లాదం కోసం జంతువులను పెంచుకోవడం, మన పనులకి వాడుకోవడం ద్వారా వాటి శ్రమ దోపిడీ చెయ్యడం, వాటి చర్మం, ఉన్ని లాంటి వాటితో చేసిన వస్తువులు వాడటం, వైద్య సంబంధమయిన ప్రయోగాలకి వాడటం ఇవన్నీ తప్పే. ఒక్క మాటలో చెప్పాలంటే.. "జంతువుల జోలికి వెళ్ళకుండా వాటి మానాన వాటినలా బ్రతకనివ్వడం" అన్నది వాళ్ళ కాన్సెప్ట్.

ఇక వెజిటేరియన్స్ లో లాక్టో వెజిటేరియన్స్ అనే ఇంకో రకం ఉంటారు. వారు జంతువుల మాంసం అయితే తినరు కానీ పాలు మరియు పాల ఉత్పత్తులు అయిన పెరుగు, వెన్న, నెయ్యి లాంటివి తింటారు. వీరి అభిప్రాయంలో ఒక జంతువు ప్రాణం తియ్యనంత వరకు జంతువులకి సంబంధించినది ఏదయినా తినొచ్చు, వాడుకోవచ్చు. అలాగే ఓవోవెజిటేరియన్స్ అనబడే మరో రకం వెజిటేరియన్స్. వీరు జంతు మాంసం తినరు, పాల ఉత్పత్తులు కూడా తినరు కానీ గుడ్లు మాత్రం తింటారు. ఇంకా చాలా రకాల వెజిటేరియన్స్ ఉంటారు. మళ్ళీ వీటిల్లోనే కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. అంటే ఉదాహరణకి కొందరు ఓవో-లాక్టో వెజిటేరియన్స్ ఉన్నట్టన్నమాట. మన దేశంలో ఉండే వెజిటేరియన్స్ లో మెజారిటీ లాక్టో వెజిటేరియన్స్ ఉంటారు. ఈ ప్రకారంగా మాంసం మాత్రం త్యజించి మిగతా జంతు ఉత్పత్తులను తినేవాళ్ళని మనం అసంపూర్ణ శాకాహారులు అనవచ్చేమో.

మనుషులందరినీ జంతువులను హింసించే స్థాయిని బట్టి వర్గాలుగా విడగొడితే అప్పుడు జంతువుల దృష్టిలో అత్యంత దుర్మార్గులుగా మొదట నాలాంటి నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. తరువాత పైన చెప్పుకున్న ఓవో-లాక్టో వెజిటేరియన్స్ ఉంటారు. ఇక జంతువుల దృష్టిలో మంచివాళ్ళు అంటే కేవలం వేగన్స్ మాత్రమే.


ఒక రెండు వందల సంవత్సరాల క్రితం ఉన్న సామాజిక పరిస్థితులను ఒకసారి చూస్తే అప్పుడు కొన్ని జాతులకి చెందిన మనుషుల్ని బానిసలుగా ఉంచుకోవడం సాంఘికంగా ఆమోదయోగ్యంగా ఉండేది. అలాగే అప్పట్లో ఉన్నత వర్గాల్లో ఉన్న స్త్రీలకి పురుషులతో సమానంగా హక్కులు లేకపోవడం కూడా చాలా సామాన్యమైన విషయం. తరతరాలుగా అనుసరిస్తున్న కొన్ని ఆచారాలనీ, సాంప్రదాయాలనీ ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ దాంట్లో ఏదన్నా తప్పుగా కనిపిస్తే అది మార్చుకుంటూ కాలంతో పాటు మారుతున్న సామాజిక పరిస్థితులకి అనుగుణంగా మార్పు చెందడం అన్నది నిరంతరంగా, ప్రకృతి సహజంగా జరిగే ప్రక్రియ. ఒకప్పుడు సంస్థాగతంగా అమోదం పొందిన "బానిసత్వం" ఇప్పుడు చట్టవిరుద్ధం అయింది. జాతి, రంగు, లింగ బేధం లేకుండా మనుషులందరికీ సమాన హక్కులు ఉండాలన్నది ఇప్పటి ప్రజల ఆకాంక్ష. ఇదే ప్రక్రియలో ఇంకొన్నాళ్ళకి ప్రాణకోటి అంతటికీ అంటే మిగతా జంతువులన్నిటినీ కూడా మనుషులతో సమానంగా చూసే పరిస్థితులు వస్తాయనీ, రావాలనీ వాటి హక్కుల కోసం పోరాడే వాళ్ళే వేగన్స్. ఇప్పుడు 'మనుషులతో జంతువులకి సమాన హక్కులా!' అని ఒకింత ఆశ్చర్యంతో చూసేవాళ్ళు చాలామందే ఉంటారు. ఒక రెండు వందల సంవత్సరాల క్రితం తెల్లవాళ్ళతో సమానంగా నల్లవాళ్ళకి హక్కులు లేక పురుషులతో సమానం గా స్త్రీలకి అవకాశాలు ఉండాలి అని మాట్లాడిన వాళ్ళని కూడా అప్పటి వాళ్ళు వీళ్ళకేమన్నా పిచ్చా అన్నట్టు చూసేవారు. నా అభిప్రాయంలో హక్కులు, సమానత్వం అన్నవి ఒకరు ఇంకొకరికి జాలిపడి ఇవ్వడం అంటూ ఏమీ ఉండదు. ఆయా అణగారిన వర్గాలవారు సామాజికంగా బలపడే కొద్దీ పోరాడి సమానహక్కులు సాధించుకోవడం మాత్రమే జరుగుతుంది. అలా మనుషుల మాదిరి జంతువులు సమానత్వం సాధించుకోడం జరగని పని కాబట్టి వేగన్స్ ప్రస్తావించే ఈ సమానత్వం పాయింట్ తో నేను ఏకీభవించను. ఇక వేగన్స్ ని పక్కన పెడితే మిగతా వెజిటేరియన్స్ అంటే ముఖ్యంగా మన దేశంలో ఉండే లాక్టోవెజిటేరియన్స్ సంగతి చూద్దాం.

లాక్టో వెజిటేరియన్స్ మీట్ తినకపోవడం వల్ల కోల్పోతున్న ప్రొటీన్ మరియు మిగతా పోషక విలువల కొరత తీర్చుకోవడం కోసం మిగతావారితో పోల్చుకుంటే పాలు మరియు పాల ఉత్పత్తులు ఎక్కువే వాడుతూ ఉంటారు. అయితే ఈ పాల ఉత్పత్తిదారులు వారి లాభం కోసం, అధిక డిమాండ్ ని అందుకోవడం కోసం పాలు ఉత్పత్తి చేసే ఆవులు గేదెల లాంటి జంతువులను అవి బ్రతికినంత కాలం ఎప్పుడూ ప్రెగ్నెంట్ గా ఉండేలా చూస్తారు. అవి ప్రెగ్నెంట్ అవడం కోసం ఉపయోగించే పద్ధతులు కూడా దారుణంగా ఉంటాయి. వాటిని ఇంప్రెగ్నేట్ చెయ్యడానికి ఉంచే బ్రీడిండ్ స్టాండ్ లను వేగన్స్ రేప్ ర్యాక్ లు అని పిలుస్తారు. ఎందుకంటే వాటి ఇష్టాయిష్టాలకి వ్యతిరేకంగా మనుషుల ఆధ్వర్యంలో బలవంతంగా జరిగే ప్రక్రియ కాబట్టి. అలానే ప్రకృతిసిద్ధంగా పుట్టిన దూడకి దక్కాల్సిన పాలలో మనుషులు తీసుకునేవే ఎక్కువ. స్వేచ్ఛగా బయట తిరగాల్సిన జంతువులను రోజులో ఎక్కువ భాగం అపరిశుభ్రమయిన ప్రదేశాల్లో కట్టేసి బంధించి ఉంచడం, ఆ జంతువులు ఇక పాల ఉత్పత్తికి పనికిరావు అనుకున్న వెంటనే వాటిని మాంసం కోసం అమ్మేయ్యడం.. ఇవన్నీ జంతువులని హింసించడమే. అధిక పాల ఉత్పత్తి కోసం జన్యు మార్పిడి చెయ్యడం, కొంచెం పాల దిగుబడి తగ్గగానే హార్మోన్ ఇంజెక్షన్స్ ఇవ్వడం.. ఇవన్నీ అందరి ఆమోదం పొందిన ప్రకృతి విరుద్ధమయిన క్రూరమైన పద్ధతులు అన్నమాట. 

కొంతమంది "అవి కష్టపడకుండా మనమే బోల్డు ఆహారం పెడుతున్నాం, శుభ్రం చేస్తున్నాం, ఎంతో ప్రేమతో చూస్తున్నాం... ఇక సమస్య ఏమిటి" అని వాదిస్తూ ఉంటారు. సరే ఇప్పుడు "నేను ఆహారం పెడతాను, పరిశుభ్రంగా ఉంచుతాను, ప్రేమగా పెంచుతాను" అని ఒక మనిషిని బానిసగా ఉంచుకోవడానికి ఈ సమాజం ఒప్పుకుంటుందా? మనుషుల విషయంలో బానిసత్వం అనేది అంత ఘోరమయిన తప్పు అయినప్పుడు జంతువుల విషయంలో ఎందుకు సరైనది అవుతుంది అన్నది వేగన్స్ ప్రశ్న. ఇక సాధారణ ప్రోబబిలిటీ ప్రకారం చూసుకుంటే పాల ఉత్పత్తి కోసం పెంచే ఆవులు, గేదె దూడల్లో ఆడ మగ శాతం 50-50 ఉండాలి. మరి మనం రోజు చూసే వాటిలో పాడి ఇచ్చే ఆడ జంతువులే ఎక్కువుంటే మగవి ఏమవుతున్నాయ్ అన్నది ఇంకో ప్రశ్న.

ఇలా ప్రత్యక్షంగానే కాకుండా కూడా జంతువుల చావుకి పరోక్షంగా కారణం అయ్యే ఉత్పత్తులు కొన్ని ఉంటాయి. ఉదాహరణకి బజార్లో దొరికే అనేక రకాల చీజ్‌ల తయారికి  రెన్నేట్ అనే ఎంజైమ్ అవసరం. ఈ ఎంజైమ్ ని చిన్న వయస్సు ఉన్న ఆవుదూడలను చంపి వాటి పొట్టలోని కొన్ని పొరల్లో నుండి సేకరిస్తారు. మన ఇండియాలో ఉండే అమూల్ ఉత్పత్తుల్లో అయితే కొన్ని రకాల నాచు నుండి డెవెలప్ చేసిన Microbial rennet వాడతారు కానీ ప్రపంచ వ్యాప్తంగా అయితే చాలా వరకు ఆవు దూడల నుండి తీసిన రెన్నేట్ ఎక్కువ వాడతారు. మీరు స్ట్రిక్ట్ వెజ్ అనుకుంటే ఏ చీజ్ అయినా కొనే ముందు ఒకసారి చూసుకోవడం బెటర్. :-) అలాగే మన ఇండియన్ స్వీట్ల మీద వాడే వెండి పూతలు (వర్క్ అంటారు) ఉంటాయి కదా.. అవి కూడా అంత పలుచని పొరగా రావడానికి కొన్ని జంతువుల పొట్ట చర్మం మీద కొట్టి తయారు చేస్తారు. ఈ రెండు ఉదాహరణల్లో శాకాహారులు జంతు అనుబంధ ఉత్పత్తులను ప్రత్యక్షంగా తినకపోయినా, తినేవి ప్యూర్ వెజ్ అయినా... ఇవి కొనడం, తినడం వల్ల ఆ జంతువుల చావుకు పరోక్షంగా కారణం అవుతున్నవారే!

ఇలా జంతువులను, ప్రకృతిలో సహజసిద్ధంగా వాటికి చెందిన హక్కులను హరించడం, వాటిని పరోక్షంగా హింసించడంలో నాన్వెజిటేరియన్స్ తో పోలిస్తే ఈ లాక్టోవెజిటేరియన్స్ ఏమీ తీసిపోరు అన్నది అందరూ అంగీకరించాల్సిన విషయం. అహింస, తోటి ప్రాణుల మీద ప్రేమ ముఖ్యోద్దేశ్యాలుగా ఆవిర్భవించిన ఈ వెజిటేరియన్ మూవ్మెంట్ ఈ రోజుల్లో నిజంగా దానికే కట్టుబడి ఉందా? "Dairy industry is as nasty as meat industry" అని అందరూ అంగీకరించాల్సిన పరిస్తితి ఉన్నప్పుడు ఆ ఇండస్ట్రీని పెంచి పొషించే లాక్టోవెజిటేరియన్స్ నిజంగా జంతు ప్రేమికులేనా?


- మంచు

Tuesday, September 13, 2011

మేము మర్చిపోలేదు... క్షమించలేదు.. - 2

*** శ్రీ రామ *** 


చాప్టర్ -2 : ప్రతీకారం 


మొదటి భాగంలో బ్లాక్ సెప్టెంబర్ అనే టెర్రరిస్టు సంస్థ అమాయక ఇజ్రాయిలీ ఆటగాళ్ళ మీద చేసిన కిరాతకం గురించి తెలుసుకున్నాం. 

గోల్డా మెయర్
తమ దేశ ఆటగాళ్ళని నిరాయుధులని చేసి దారుణంగా హింసించి, అమానుషం గా చంపివేసిన సంఘటన ఇజ్రాయిల్ దేశ ప్రజలని తీవ్రంగా కలచివేసింది. బాధ్యులయిన వారిని కఠినం గా శిక్షించాలని ప్రభుత్వం మీద వివిధవర్గాల నుండి వత్తిడి పెరిగింది. అయితే జరిగిన సంఘటనను అంతే సీరియస్ గా తీసుకున్న ప్రధానమంత్రి గోల్డా మెయర్ తన సొంత నాయకత్వం లో , మోస్సాద్ డైరెక్టర్ Zvi Zamir, డిఫెన్స్ మినిస్టర్ మోషే దయాన్ మొదలగు ప్రభుత్వ ఉన్నతాధికారులతో భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడానికి "Committee X" అనే ఒక కమిటీ  ఏర్పాటు చేసారు. 


ఇలాంటి దారుణమయిన సంఘటనలు ఇకపై ముందు ముందు జరగకుండా ఉండాలంటే ఈ మ్యూనిచ్ హత్యాకాండకు ప్రత్యక్షంగా బాధ్యులైన ఆ బ్రతికున్న ముగ్గురు టెర్రరిస్టులతో పాటు వీరికి కావాల్సిన ఫండ్స్, ప్లాన్స్ సమకూర్చిన తెరవెనుక వ్యక్తులను, సంస్థలను ఎవరినీ వదలకూడదని  ఈ కమిటి తీర్మానించింది. అంటే కసబ్ లా చావుకి తెగించి వచ్చిన ముష్కరులను మాత్రమే శిక్షించి సరిపెట్టేస్తే,  ఈరోజు కసబ్ ని పంపినవారు రేపు ఇంకొకడిని పంపిస్తారు కదా అన్నది వాళ్ళ ఉద్దేశ్యం. అయితే శత్రుదేశం అండదండలతో వారి దేశాల్లో స్థావరం ఏర్పాటు చేసుకుని ఈ టెర్రరిస్టు కార్యకలాపాలు సాగిస్తున్న వారిని వెతికి పట్టుకుని ఇజ్రాయిల్ తీసుకొచ్చి శిక్షించడం జరిగే పని కాదు కనుక వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడికే దొంగచాటుగా వెళ్లి చంపాలని ఈ కమిటీ సలహా ఇచ్చింది. అయితే ఈ ప్రతిపాదన ప్రధానమంత్రి గోల్డా మెయర్ కి అంత నచ్చలేదు. అయితే దేశ ప్రజల నుండి, ప్రభుత్వ ఉన్నతాధికారుల నుండి వస్తున్న ఒత్తిడికి తలవంచి అయిష్టంగానే ఈ ఆపరేషన్ కి సమ్మతించింది.


అదే సమయంలో ఈ బ్లాక్ సెప్టెంబర్ టెర్రరిస్టులు జర్మనీకి చెందిన లుఫ్తాన్సా విమానం LH615 ని హైజాక్ చేసి ఆ మ్యూనిచ్ హత్యాకాండలో పాల్గొన్న తమ సహచరులను వెంటనే వదిలేయాలని డిమాండ్  విధించారు. ఈ డిమాండ్లను జర్మనీ మొదట అంగీకరించలేదు. అయితే తమ సంస్థ సభ్యులను విడుదల చేసేవరకు  లుఫ్తాన్సా విమానాన్ని ల్యాండ్ అవనివ్వమని , తమ అనుమతి లేకుండా ల్యాండ్ చేస్తే విమానాన్ని పేల్చి వేస్తామని తేల్చి చెప్పడం తొ విధిలేని పరిస్తితులలొ ఆ ముగ్గుర్ బ్లాక్ సెప్టెంబర్ తీవ్రవాదులని జర్మని విడుదల చేసింది. తమ డిమాండ్లు నెరవేరాక ల్యాండ్ అవడానికి అనుమతించిన విమానం లొ అప్పటికి కేవలం ఒక్క నిముషం మాత్రమే ప్రయాణిచడానికి సరిపడా ఇంధనం మిగిలిందట.
అయితే ఈ తీవ్రవాదులను ఇజ్రాయిల్ తీసుకొచ్చి చట్టప్రకారం శిక్ష విధిద్దాం అని ఎదురు చూస్తున్న సమయంలో ఇలా వెస్ట్ జర్మనీ తీవ్రవాదులను వదిలి వెయ్యడంతో ప్రధానమంత్రి గోల్డా మెయర్ కి ఈ ఆపరేషన్ అమలు పరచడానికి తన మనసులో ఉన్న చిన్నపాటి సంశయం కూడా తొలగిపోయినట్టయింది.

Operation Wrath of God  అని నామకరణం చేసిన అపరేషన్ లొ మొదటి టాస్క్ ఏమిటంటే... అసలు ఈ హత్యాకాండ వెనుక ఎవరున్నారు, ఏ ఏ టెర్రరిస్టు ఆర్గనైజేషన్స్ లీడర్లు ఏ విధం గా సపోర్ట్ చేసారు, ప్లాన్ ఎవరు చేసారు, డబ్బు ఎవరు సమకూర్చారు ఇలా ఒక లిస్టు తయారు చెయ్యడం. తమ మోస్సాద్ గూఢచారులు మరియు ఇతర ఐరోపా మితృ దేశాల గూఢచారి సంస్థల సహాయంతో తయారు చేసిన ఆ లిస్టులో 20 నుంచి 35 మంది బ్లాక్ సెప్టెంబర్ మరియు పిఎల్‌వొ  సంస్థలకి చెందిన వివిధ స్థాయిల్లో ఉన్న నాయకులు ఉన్నారు. ఈ లిస్టు రెడీ అయ్యాక వీళ్ళు ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారు అన్నది కనిపెట్టడం రెండవ పని. అది ఇజ్రాయిల్ గూఢచారి సంస్థ అయిన మోస్సాద్ కి అప్పచెప్పారు. అమెరికాకి సిఐఏ, రష్యాకి కేజిబి లా మోస్సాద్ అనేది ఇజ్రాయిల్ యొక్క సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ అన్నమాట. 

అయితే ఇక్కడ ఈ టెర్రరిస్టు నాయకులని శిక్షించేటప్పుడు మోస్సాద్ యొక్క లక్ష్యాలు ఏంటంటే...
  • ఎట్టి పరిస్థితులలోను ఆ టెర్రరిస్టు నాయకులని చంపడం వెనుక ఇజ్రాయిల్ హస్తం ఉందని సాక్ష్యాలు దొరకకూడదు...
  • చంపే విధానం టెర్రరిస్టులకు వణుకు పుట్టించే విధంగా ఉండాలి..
  • "తప్పు చేస్తే ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా మీరు మా నుండి తప్పించుకోలేరు.... మేము తలచుకుంటే ఎక్కడికి వచ్చి అయినా మిమ్మల్ని చంపగలం" అన్న మెసేజ్ బలంగా పంపడం...
వగైరా అన్నమాట... 

ఆ మొస్సాద్ టార్గెట్ లిస్టులొని వ్యక్తులు ఎవరెవరు ఎక్కడ ఉంటున్నారో తెలిసాక వీళ్ళను చంపడానికి మోస్సాద్ ప్రత్యేకమయిన టీంలు తయారు చేసింది. పదిహేను మందితో కూడిన ఒక్కో టీంలో ఐదు విభాగాలు ఉండేవి..
  • పూర్తిగా శిక్షణ పొందిన ఇద్దరు మెయిన్ కిల్లర్స్, 
  • వీళ్ళను చూసుకుంటూ వీరి వెనుకే అనుసరించే ఇంకో ఇద్దరు బ్యాకప్ కిల్లర్లు, 
  • వీళ్ళు చంపడానికి వెళ్ళినప్పుడు ఆయా దేశాల్లో ఉండటానికి అవసరమయిన హోటల్స్, అపార్ట్మెంట్లు, అద్దె కార్లు వగైరా ఏర్పాట్లు చూడటానికి ఒక ఇద్దరు ఏజెంట్లు, 
  • అప్పట్లో సెల్ ఫోన్ లు లేవు కాబట్టి కమ్యూనికేషన్ కోసం ఇద్దరు స్పెషలిస్ట్లు, 
  • మిగతావారు చంపబోయే ఆ టెర్రరిస్టు నాయకుడి కదలికలు గమనించి ఫైనల్ ప్లాన్ తయారు చెయ్యడానికి మరియు తరువాత పారిపోవడానికి అవసరమయిన ఎస్కేప్ రూట్లు తయారు చేసే టీం అన్నమాట.

ప్రతీ ఆపరేషన్ ముందు ఈ టీం చంపడానికి కొన్ని గంటల ముందు
చంపబోయే ఆ టెర్రరిస్టు నాయకుడి ఇంటికి ఒక ఫ్లవర్ బొకే తో ఈ మెసేజ్ పంపేవారు...

"A reminder we do not forget or forgive"  ("మేము మరచిపోం.. క్షమించం..")



ఈ మ్యూనిచ్ హత్యాకాండ జరిగిన నలభై రోజుల తరువాత... ఇటలి లోని రోమ్ నగరంలొ పిఎల్‌వొ  (పాలస్తినా లిబెరేషన్ ఆర్గనైజేషన్) కి ఇటలీ రెప్రజెంటేటివ్ గా పనిచేస్తూ మ్యూనిచ్ ఒలంపిక్ హత్యాకాండకు అండదండలు అందించాడని అనుమానిస్తున్న Abdel Wael Zwaiter డిన్నర్ ముగించుకుని తిరిగి తన  నివాసానికి వస్తుండగా, రోడ్డుపక్కన నక్కిన ఇద్దరు ఏజెంట్ల చేతులలో హత్యకు గురయ్యాడు. హత్య చేసినవారు ఇతన్ని తుపాకితో పదకొండు సార్లు కాల్చారు... చనిపోయిన పదకొండు మంది ఇజ్రాయిలీ ఆటగాళ్లకి గుర్తుగా...  


రెండో ప్రతీకార హత్య ప్యారిస్ లో జరిగింది... పిఎల్‌వొ ఫ్రాన్స్ రెప్రజెంటేటివ్ గా ఉన్న మహ్మద్ హంషారి ని పత్రికా విలేఖరిగా తనను తాను పరిచయం చేసుకున్న ఒక ఏజంట్ మాయమాటలు చెప్పి ఇంటినుండి బయటకు తీసుకెళ్లగా... అదే టైంలో ఇంకో ఇద్దరు ఏజెంట్లు అతని ఇంట్లోకి ప్రవేశించి ఫోన్ లో బాంబ్ అమర్చారు. ఇతను తిరిగి ఇంటికి వచ్చాక అతనికి ఫోన్ చేసి... ఫోన్ ఎత్తింది హంషారినే అని ధృవీకరించుకున్నాక... రిమోట్ తో ఆ బాంబు పేల్చివేసారు. 

ఆ తరువాత బ్లాక్ సెప్టెంబర్ సైప్రస్స్ రెప్రజెంటేటివ్ ఆల్ బషీర్ తన మంచం కింద పెట్టిన బాంబు ప్రేలి మరణించగాబ్లాక్  సెప్టెంబర్ తీవ్రవాదులకి అయుధాలు అందచెయ్యడం లొ కీలక పాత్రధారి "లా ప్రొఫెసర్ అల్ కుబైసి" పారిస్ రోడ్డు మీద ఏజంట్ల తుపాకి బుల్లెట్ల నుండి తప్పించుకోలేక పోయాడు. 



తరువాతి టార్గెట్ లెబనాన్ లోని బీరుట్ నగరంలో అత్యంత కట్టుదిట్టమయిన భద్రత మధ్య ఉన్న పిఎల్‌వొ ఉన్నత అధికారులు... లెబనాన్ శత్రుదేశం కాబట్టి ఇంతకు ముందులా సులభంగా ఆ దేశం లోకి ప్రవేశించి వాళ్ళని చంపలేరు... అందుకే వీరి కోసం స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు.  ఏప్రిల్ 13, 1973 అర్ధరాత్రి అకస్మాత్తుగా చేపట్టిన ఆపరేషన్లో బాంబులు వేసి కొందరు పిఎల్‌వొ కీలక నేతలు మకాం ఉంటున్న భవంతిని బాంబులతో పేల్చివేయడం ద్వారా పలు తీవ్రవాద నేతల్ని మట్టుపెట్టారు. అప్పుడు ఆ ఆపరేషన్ పాల్గొన్న కమెండోలలో ఆ తరువాత ఇజ్రాయిల్ కి ప్రధాన మంత్రిగా పనిచేసిన Ehud Barak కూడా ఉన్నారు.  

అలా కొన్ని ప్రతీకార హత్యలు జరిగాక... మోస్సాద్ మ్యూనిచ్ హత్యాకాండకి మాస్టర్ మైండ్ అని భావించే అలీ హసన్ సలేమా అనే బ్లాక్ సెప్టెంబర్ కీలక నేతపై దృష్టి సారించింది. ఒక సంవత్సరం ఇతని కోసం ప్రపంచం అంతా గాలించాక అతను నార్వేలో లిల్లి హామార్ అనే ఊళ్ళో హోటల్ వెయిటర్ గా పనిచేస్తున్నాడన్న సమాచారం అందింది. అక్కడకు చేరుకొని ఆపరేషన్ పూర్తి చేశాక మోస్సాద్ ఏజెంట్స్ కి ఆ వెయిటర్ తాము అనుకుంటున్న అలీ హసన్ కాదని, అతనొక అమాయక వ్యక్తి అని తెలుసుకున్నారు... అదే టైంలో ఈ ఆపరేషన్లో పాల్గొన్న ఏజంట్లు అందరూ నార్వే పోలీసులకి నాటకీయ ఫక్కీలో దొరికిపోయారు... అయితే ఒక రెండు సంవత్సరాల తరువాత వాళ్ళు బయటకు వచ్చేసారు కానీ... నార్వే లో జరిగిన పొరబాటుకు ప్రపంచ వ్యాప్తంగా వెల్లువెత్తిన  నిరసనల  వల్ల ఇజ్రాయిల్ ఈ ప్రతీకార ఆపరేషన్ని రద్దు చెయ్యాల్సి వచ్చింది. అయితే... అసలు ఆ అలీ హసన్ పోలికలు ఉన్న అమాయక వ్యక్తిని అలీ హసనే అని తప్పుడు సమాచారం అందించి,  మోస్సాద్ ఏజెంట్లు ఆ అమాయకుడిని చంపాక వెంటనే నార్వే పొలీసులకి సమాచారం అందించి ఈ ఏజంట్లు దొరికిపోయేలా చెయ్యడం, అలాగే జరిగిన పొరబాటుని ప్రపంచం ముందు ఉంచడం ద్వారా... మిగతా దేశాల నుండి ఒత్తిడి తెప్పించి ఈ ఆపరేషన్ని రద్దు అయ్యేలా చెయ్యడం ఇదంతా స్వయంగా అలీ హసన్ పన్నిన కుట్రే!

1973 లో ఈ లిల్లి హెమర్ పొరబాటు వల్ల రద్దయిన మోస్సాద్ ఆపరేషన్ మళ్ళీ 1978 లో కొత్త ప్రధాని నాయకత్వంలో పునఃప్రారంభించబడింది... మళ్ళీ అలీ హసన్ గురించి ప్రపంచవ్యాప్తంగా అన్వేషణ మొదలయ్యి మొత్తానికి అతను లెబనాన్ లో తలదాచుకుంటున్నట్టు గుర్తించారు. బ్రిటిష్ , కెనడా పాస్‌పొర్ట్ లతొ లెబనాన్ లొ ప్రవేశించిన మొస్సాద్ ఏజెంట్లు అలీ హసన్ ఎక్కువగా సంచరించే వీదిలొనే ఒక అపార్ట్మెంట్ అద్దెకు తీసుకుని రెండు నెలల పాటు అతని కదలికలని బాగా గమనిస్తూ, అనువైన సమయం కొసం ఎదురు చూసి అఖరికి 1979 జనవరి 22 మధ్యాహ్నం కార్ బాంబు పేల్చి అతన్ని అంతమొందించారు. అలా కొన్నాళ్ళ వరకూ ఈ ప్రతీకార హత్యలు కొనసాగాయి కానీ మ్యూనిచ్ హత్యాకాండలో ప్రత్యక్షంగా పాల్గొన్న టెర్రరిస్టులలో మిగిలి ఉన్న ముగ్గుర్ని మోస్సాద్ ఏజెంట్లు చంపగాలిగారా లేదా అన్నది ఇప్పటికి ప్రశ్నే! ఈ ప్రతీకార హత్యలే కాకుండా కొంచెం అనుమానం ఉన్న హైర్యాంక్ లో ఉన్న పిఎల్‌వొ నాయకుల్ని నియంత్రించడానికి అనేకమయిన సైకలాజికల్ యుద్ధాలు కూడా మోస్సాద్ చేపట్టింది. అందులో వాళ్ళ పర్సనల్ సీక్రెట్స్ (ముఖ్యంగా చీకటి కోణాలు) సంపాదించి... పిఎల్‌వొ కి దూరంగా ఉండకపోతే ఆ సీక్రెట్స్ పబ్లిక్ లో పెడతాం అని బెదిరించడం లాంటివి కొన్ని... 


అలా ఆ మ్యూనిచ్ హత్యాకాండకి బాధ్యులయిన వారిని వేటాడి చంపడం ఆ తరువాత ఇరవై సంవత్సరాల పాటు జరిగింది... అవును ఇరవై సంవత్సరాలే! ఎందుకంటే.... "they do not forget or forgive".

అయితే ఈ ప్రతీకారచర్యలు మధ్యప్రాచ్యంలో శాంతికి తోడ్పడ్డాయా? ఇలా దొంగతనంగా చంపడం సబబేనా.. నైతికంగా సరి అయినదేనా? ఇలా టెర్రరిస్టులను శిక్షించే క్రమంలో కొందరు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.. అది తప్పు కాదా? దీనివల్ల ఇజ్రాయిల్ సాధించింది ఏమిటి? ఇలా ఎన్నో ప్రశ్నలు ఉదయించాయి...  అవును ఇది మధ్య ప్రాచ్యంలో శాంతి పెంపొందించలేదు.. కానీ వాళ్ళు అనుకున్నది సాధించారు.. తమ దేశప్రజలపై,  అమాయక ఆటగాళ్ళపై భయానక దాడి చేసిన వారికి శిక్ష అమలు పరచడానికి ఎంతకయినా తెగిస్తాం అని నిరూపించారు.... పిరికిపందలుగా వచ్చి హత్యలు చేసి పరాయి దేశం చేరిపోతే చాలు అనుకునే వాళ్లకి మీరు ఎక్కడ ఉన్నా మేము మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదు అన్న మెసేజ్ బలంగా పంపించారు. 

ఒక్కమాటలో చెప్పాలంటే టెర్రరిస్ట్లకే టెర్రర్ పుట్టించారు.

ఇక మన కమాండోలు పాకిస్తాన్ వెళ్లి మన దేశసమగ్రతను విచ్ఛిన్నం చెయ్యడానికి సర్వ విధాలా ప్రయత్నిస్తున్న ప్రతీ ఒక్కడిని ఆ మాటకొస్తే  ఏ ఒక్కడినయినా ఇలా వేటాడి శిక్షించే రోజు వస్తుందంటారా? అమాయక ప్రజల్ని అత్యంత కిరాతకం గా చంపుతున్న వారిని పట్టుకొవడానికి ఇప్పటికిప్పుడు మనం అమెరికా వాడిలా కొట్లు కుమ్మరించి యుద్దానికి వెళ్లమని కొరడం లేదు.... అక్రమిత కాశ్మీర్ మీద దాడులు చేసి తీవ్రవాద ట్రైనింగ్ క్యాంపులు నాశనం చేస్తారన్న ఆశ అస్సలు లేదు. కఠినమైన కొత్త కొత్త చట్టాలు తెచ్చి తీవ్రవాదం అరికట్టడానికి ప్రయత్నించి మైనారిటీల మనొభావాలను కించపరచమని కొరడం లేదు. అడిగేదల్లా ఒక్కతే.. సాధారణ ప్రజల ప్రాణానికి కూడా కాస్త విలువ నివ్వమని. 

చేతికి దొరికినా, వాళ్ళ నేరం నిరుపించబడ్డా, అత్యున్నత న్యాయస్థానం శిక్ష ఖరారు చేసాకా కూడా... స్వార్ధ ప్రయోజనాల కొసం వాళ్ళకా శిక్ష అమలుపరచలేని (అమలుపరచని) దొంగ వెధవలని మనం ఎన్నుకున్నంత కాలం అది అత్యాశేనంటారా? 

మనపై జరిగిన అమానుషదాడిని "  క్షమించడం ... మర్చిపొవడం.... "  అన్నది .....

మొదటిసారి మన విశాల హృదయాన్ని, మంచితనాన్ని సూచిస్తే... రెండొసారినుండి అది మన చేతకానితనానికి చిహ్నం 


జై హింద్ 

 - మంచు


------------------------------------------------------------------------
గొల్లపూడి మారుతిరావ్ గారి వ్యాసం కూడా ఇక్కడ చదవగలరు. 


అలాగే మ్యూనిచ్ మారణకాండ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నవారు... ఈ పుస్తకాలు, సినిమాలు చూడవచ్చు.
 పుస్తకాలు
1. Simon Reevs రాసిన One Day in September: the full story of the 1972 Munich Olympics massacre and the Israeli revenge operation 'Wrath of God',
2. George Jonas రాసిన  Vengeance: The True Story of an Israeli Counter-Terrorist Team
సినిమాలు
1. Sword of Gideon  (HBO మూవీ)  మరియు

2. స్టీవెన్ స్పెల్బెర్గ్  యొక్క Munich సినిమా